కలం, నిర్మల్: సహజసిద్ధ పంటలు, కల్తీలేని ఆహారంతోనే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పద్మశ్రీ, రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుభాష్ శర్మ అన్నారు. నిర్మల్ (Nirmal ) జిల్లా కేంద్రంలో సహజసిద్ధ, ఆర్గానిక్ వస్తువులు, ఆహార పదార్థాల విక్రయ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కలుషిత గాలి, నీరు, ఆహారం కారణంగా దేశంలో ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. దేశ ప్రజలకు సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత రైతులపై ఉందన్నారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందులకు దూరంగా సహజసిద్ధ పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని సూచించారు.
ఆర్గానిక్ పంటల సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు తమ సంస్థ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సహజ ఆహారాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నిర్మల్ లో విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సహజ వ్యవసాయం, ఆర్గానిక్ పంటలపై చేస్తున్న కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తనకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందించిందని తెలిపారు. అదే స్ఫూర్తితో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నానని అయన పేర్కొన్నారు.

