కలం, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లాలో ఏఈ నూకరాజు కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న సాదిక్ ఖాన్ (Sadiq Khan)ను పోలీసులు యూపీలో అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొస్తున్నారు. అర్ధరాత్రి రైలు సామర్లకోటకు చేరుకోనుందని పోలీసులు తెలిపారు. అతడిని సర్పవరం పోలీస్ స్టేషన్కు తరలించి విచారించబోతున్నారు. సాదిక్ వేధింపులకు తాళలేక ఈ నెల 16న ఏఈ నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయతో కలిసి గోదావరిలో దూకి ఆత్యహత్యకు పాల్పడ్డారు.
కార్తికేయ ప్రాణాలతో బతికి బయటపడగా.. మిగతా ముగ్గురు చనిపోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. సీఎం చంద్రబాబు సైతం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సాదిక్ సామర్లకోటలో కోణార్క్ రైలు ఎక్కి ఉత్తరాదికి పారిపోయాడు. అయిదు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు తిరిగాడు. యూపీలో ఉన్నట్లు గుర్తించిన కాకినాడ పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో మీరట్ నగరంలో అదుపులోకి తీసుకుని రైలులో ఏపీకి తీసుకొస్తున్నారు.
ప్రైవేట్ వీడియోలతో బెదిరించి…
సాదిక్ ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పదేళ్ల కార్తికేయను అతడి తల్లి సౌజన్య సాదిక్ ఖాన్ రైఫిల్ షూటింగ్ అకాడమీలో చేర్పించారు. ఈ క్రమంలో సౌజన్యతో పరిచయం పెంచుకున్న సాదిక్.. ఆమె ప్రైవేట్ వీడియోలు, వ్యక్తిగత ఫొటోలు సేకరించాడు. వాటిని చూపించి ఆమెను నిత్యం బెదిరింపులకు గురి చేసేవాడు. సోషల్ మీడియాలో పెడుతానని వేధించేవాడు. తన తల్లిని అప్పుడప్పుడు కొట్టేవాడని కుమారుడు కార్తికేయ పోలీసులకు వివరించాడు.
ఈ క్రమంలో భర్త జగదీష్ రెడ్డిని కూడా హత్య చేసినట్లు సౌజన్య సూసైడ్ లెటర్లో తెలిపారు. తన కుమారుడిని సాదిక్ పాయిజన్ ఇంజిక్షన్ ఇచ్చి చంపేశాడని జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

