కలం, నిర్మల్: తానూర్ మండలం బోరేగాం గ్రామ బాలాజీ గుట్టపై దాదాపు 20 ఏళ్లుగా నెలకొన్న విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఆలయానికి విద్యుత్ సౌకర్యం లేక భక్తులు, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇటీవల ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టారు. కేవలం మూడు రోజుల్లోనే బాలాజీ గుట్టపై ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ (Balaji Gutta Electricity) సరఫరాను పునరుద్ధరించారు.
దాదాపు రెండు దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే బాలాజీ గుట్టపై ఇన్నేళ్లుగా విద్యుత్ సౌకర్యం లేకుండా పోయిందన్నారు. ప్రజలు తమ సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండల బీజేపీ సీనియర్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

