కలం, వెబ్ డెస్క్: భారత్లో ఖాళీగా ఉన్న యువతపై నీతి ఆయోగ్ (Niti Aayog) సంచలన నివేదిక బయటపెట్టింది. దేశ వ్యాప్తంగా మొత్తం 8.7 కోట్ల మంది యువత చదువు, ఉద్యోగం, ఎలాంటి శిక్షణ లేకుండా ఖాళీగా ఉన్నారని పేర్కొంది. వీరంతా 15 సంవత్సరాల నుంచి 29 ఏళ్ల లోపే కావడం గమనార్హం. ఈ పరిస్థితికి తక్కువ ఆదాయం, చదువుకున్న స్థాయికి ఉద్యోగాలు దక్కకపోవడం, చదువుల కోసం చేసిన అధిక ఖర్చు ప్రధాన కారణమని నీతి ఆయోగ్ వెల్లడించింది.
దేశంలో ఇప్పటి వరకు ఉన్నత చదువులు చదువుకున్న వారిలో కేవలం 8.25 శాతం మంది మాత్రమే తమ అర్హతకు తగిన ఉద్యోగాలు పొందుతున్నారు. సరైన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది గ్రాడ్యుయేట్లు తమ చదువుకు తగ్గ ఉపాధి, వేతనం లభించక ఇబ్బంది పడుతున్నారు. వీరిలో కొందరు కుటుంబాలను నడపడం కోసం చిన్న చిన్న ఉద్యోగాలలో చేరుతున్నారు. మరికొందరు అలాంటి ఉద్యోగాల్లో చేరలేక పూర్తిగా ఖాళీగా ఉండిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చేందుకు నీతి ఆయోగ్ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. సబ్సిడీతో కూడిన శిక్షణా కార్యక్రమాలు, స్థానిక అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి చేయాలని సూచించింది. యువత చదువుకుంటూనే డబ్బులు సంపాదించేలా అవకాశాలు కల్పించాలని పేర్కొంది. యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తూ, అవకాశాలు పెంచితే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరవచ్చని తెలిపింది.

