కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL Ramagundam) ప్లాంట్ను మరోసారి షట్డౌన్ చేయడంతో సుమారు 10 రోజుల పాటు ఉత్పత్తికి పూర్తిగా అంతరాయం కలగనుంది. ప్రస్తుత ఖరీఫ్ సాగు సీజన్లో యూరియాకు విపరీతమైన డిమాండ్ ఉన్న సమయంలో ఈ షట్డౌన్ నిర్ణయం తెలంగాణ రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. అమ్మోనియం పైప్ లైన్ లీకేజీతో ఎరువుల ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. శనివారం జరిగిన సంఘటన కారణంగా అప్రమత్తమైన ఇంజనీరింగ్ విభాగం అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ప్లాంట్ నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేశారు.
ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమా..!
గతంలో స్టీమ్ పైప్లైన్ పగిలిపోవడం, అమ్మోనియా గ్యాస్ లీకేజీలు గ్యాస్ కొరత వంటి కారణాల వల్ల యూరియా ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా వార్షిక ఉత్పత్తి టార్గెట్ 12.7 లక్షల టన్నులు. యూరియా ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం రైతులపై పడే అవకాశం ఉంది. ఏటా ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో 11 రాష్ట్రాలకి కేటాస్తున్నారు. ఇక్కడ యూరియా ఉత్పత్తి తగ్గితే దీనిప్రభావం ప్రథమంగా రాష్ట్ర రైతాంగంపైనే పడనున్నది. రెండు మూడేళ్లుగా ప్రతి యేడాది మూడు నుంచి నాలుగు నెలల పాటు సాంకేతిక సమస్యల పేరుతో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
ప్లాంట్ పదే పదే మూతపడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ, ఆంద్ర ప్రధేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్ రాష్ట్రాలకు రామగుండం ఆర్ఎఫ్సీఎల్ నుంచే యూరియా సరఫరా అవుతోంది. ఈ ప్లాంట్లో రోజుకు 3850 టన్నుల యూరియా ఉత్పత్తి జరగాల్సి ఉన్న క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి 11 శాతం యూరియా సరఫరా చేయాల్సి ఉంది. గత జులై లోనూ ఆర్ఎఫ్సీఎల్ 10 రోజులు నడవలేదు.
ఎల్ నినో ప్రభావంతో అప్పుడు అంత ప్రభావం చూపలేకపోయింది. వర్షాలు కురవటంతో రైతులు వరి సాగు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో యూరియా అత్యవసరమైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పపటికే చెప్పులు క్యూలైన్ లో పెట్టి యూరియా కోసం రైతులు నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి షట్ డౌన్తో యూరియా కొరత మరింత పెరిగే అవకాశాలుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
కేంద్రానికి మంత్రి లేఖ
ఆర్ఎఫ్సీఎల్ నిరంతర షట్డౌన్ల వల్ల రాష్ట్రంలో యూరియా సరఫరా దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు శనివారం అత్యవసర లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఈ షట్డౌన్ను వీలైనంత త్వరగా ముగించి, ప్లాంట్లో ఉత్పత్తిని పునరుద్ధరించేలా చూడాలని మంత్రి కోరారు.
ప్రత్యామ్నాయ RFCL నిలిపివేత వల్ల ఏర్పడే యూరియా లోటును భర్తీ చేయడానికి ఇతర దేశీయ ప్లాంట్ల నుండి లేదా దిగుమతుల ద్వారా తెలంగాణకు అదనపు యూరియా కోటాను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది. RFCL ప్లాంట్లో తరచూ సాంకేతిక లోపాలు, పైప్లైన్ లీకేజీలు లేదా నిర్వహణ పనుల (షట్డౌన్) కారణంగా ఉత్పత్తి ఆగిపోవడం రైతులకు, ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా తగినన్ని యూరియా నిల్వలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.

