కలం, ఖమ్మం బ్యూరో: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భద్రాచలం (Bhadrachalam) సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రావణ మాసంలో పవిత్రమైన ఈ పర్వదినాన లక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి పోటెత్తారు. ఆలయంలో శ్రావణ శోభ ఉట్టిపడగా, భక్తుల జయజయధ్వానాలతో రామాలయ ప్రాంగణం మార్మోగింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారికి విశేషమైనది అయినప్పటికీ, రెండవ శుక్రవారం రోజున నిర్వహించే వరలక్ష్మీ వ్రతానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉందని ఆలయ అర్చకులు తెలిపారు.
భద్రాచల ఆలయంలో నిత్య కల్యాణాలు జరిగే శ్రీరామసేవా మంటపంలో లక్ష్మీ అమ్మవారికి సామూహిక సహస్రనామ కుంకుమార్చనను వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి కుంకుమార్చనలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

