కలం, వెబ్డెస్క్: పండుగల వేళ రాష్ట్రంలో కల్తీ స్వీట్లు, డ్రైఫ్రూట్స్ తయారు చేస్తున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆదిబట్ల (Adibatla) లోని బొంగ్లూర్లో ఓ ఆహార తయారీ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. ఇక్కడ గడువు ముగిసిన మైదా, లేబుల్స్ లేని ఫ్లేవర్లు, ఇతర పదార్థాలను ఉపయోగిస్తూ అపరిశుభ్ర వాతావరణంలో కల్తీ సోన్ పాపడీ (Adulterated Soan Papdi), కల్తీ డ్రై ఫ్రూట్స్ తయారు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో 1,560 జార్ల సోన్ పాపడీ, 240 జార్ల చిక్కీతో పాటు ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.4.07 లక్షలుగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సాధారణంగా పండుగల సమయంలో, ముఖ్యంగా దీపావళి సమయంలో బంధువులకు సోన్ పాపడీని బహుమతిగా ఇస్తుంటారు. ఇంకా ప్రతి పండుగకు, శుభకార్యాలకు ఎక్కువ మంది చౌకగా లభించే సోన్ పాపడీకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో కల్తీ వ్యవహారంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కల్తీ దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని, తయారీదారులు నాణ్యతపై దృష్టి సారించేలా చూడాలని కోరుతున్నారు.

