కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో 27 రోజుల పాటు జరిగే నక్షత్రమాల కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నక్షత్రమాలను భక్తితో ధరించారు. చారిత్రాత్మకమైన, భక్తుల కొంగుబంగారంగా భావించే వీరభద్రస్వామి నక్షత్రమాల కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
గతంలో తాను నక్షత్రమాలను ధరించానని, ఈ ఏడాది కూడా మొక్కు మేరకు స్వామివారి నక్షత్రమాలను భక్తితో ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సమృద్ధిగా జీవించాలని ఆకాంక్షించారు. రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.

