కలం, నిర్మల్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సమావేశ ప్రాంగణాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కాంగ్రెస్ (Nirmal Congress) నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న కార్యక్రమం జరిగిన ప్రాంగణాన్ని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు శుద్ధి చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బొజ్జు పటేల్ అన్నారు. ఇలాంటి చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో పరస్పర గౌరవం, రాజ్యాంగ విలువలను పాటించడం అవసరమని ఆయన అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

