కలం, నిజామాబాద్ బ్యూరో: తిరంగా ర్యాలీ (Tiranga Rally) తో అందరి గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ (Nizamabad) నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒకప్పుడు కేవలం స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజున మాత్రమే జాతీయ జెండాలను ఆవిష్కరించే వారని అన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. దీంతో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమం వల్ల దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం కూడా ఉంటుందన్నారు. ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా భారతీయుల ఐక్యత కోసం రూపొందించిన కార్యక్రమం అన్నారు.
యువతలో జాతీయ భావాన్ని పెంపొందించడం, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యాన్ని పెంచడం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తిరంగా ర్యాలీ (Tiranga Rally) అంటే చేతిలో జెండా పట్టుకొని నడవడం మాత్రమే కాదని ప్రతి ఒక్కరి హృదయంలో దేశభక్తిని, మన ఆలోచనలలో జాతీయతను, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడమని వివరించారు. ఇప్పటి యువత స్వాతంత్య్ర సమరయోధుల పాఠాలు చదవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తెలిపారు.
చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్, ఉద్దం సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, అబ్దుల్ కలాం తదితరుల చరిత్రను యువత తెలుసుకోవాలని సూచించారు. దేశానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడిన ఊరుకునేది లేదన్నారు. మతాల మధ్య చిచ్చు పెడితే వదిలేది లేదన్నారు. మువ్వన్నెల జెండా ముద్దాడాలంటే అదృష్టం ఉండాలని, దేశం సురక్షితంగా ఉంటుందంటే కారణం వారి త్యాగ ఫలితమే అన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతం హుషారుగా కొనసాగింది.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థల ప్రదినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్కు గుడ్ బై?.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్లారిటీ..!
Follow Us On: Sharechat

