కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీకి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 14వ తేదీన ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు పూర్తి స్థాయి వివరాలతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. మంత్రి వర్గానికి అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు నిర్వహించబోతున్న కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది.
అసెంబ్లీ సమావేశాలపై చర్చ..
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆగస్ట్ 15న ప్రారంభించబోతున్న సంక్షేమ పథకాలపై చర్చ జరగనున్నట్లు సచివాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోబోతున్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమ బిల్లు సహా ఇతర కీలకమైన బిల్లులను ప్రవేశ పెట్టే అంశంపైనా సమీక్షించబోతున్నారు. అదే సమయంలో కొన్ని పాలనాపరమైన నిర్ణయాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వివిధ ప్రాజెక్టులకు అనుమతులు కూడా జారీ చేయబోతున్నట్లు సమాచారం.

