కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లాలోని నార్సింగి మండలం జప్తి శివునూర్ జాతీయ రహదారి పక్కన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీకి చెందిన గెస్ట్ హౌస్ (Shabbir Ali Guest House) కాంపౌండ్ వాల్ను స్థానిక గ్రామస్తులు ధ్వంసం చేశారు. తమ పంట పొలాలకు వెళ్లే పురాతన రహదారిని మూసివేస్తూ ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వందల సంవత్సరాలుగా తాము ఈ దారి గుండానే వ్యవసాయ భూములకు వెళ్తూ సాగు చేసుకుంటున్నామని, ఇప్పుడు ప్రహరీ గోడ నిర్మిస్తే తమకు దారి లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే ఈ విషయమై విన్నవించినప్పటికీ, తమ విజ్ఞప్తులను పట్టించుకోకుండా నిర్మాణం కొనసాగించడంతోనే సహనం నశించి గోడను కూల్చివేసినట్లు రైతులు తెలిపారు. ఈ ఘటనతో నార్సింగి మండలంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

