కలం, స్పోర్ట్స్ : సియోల్ వేదికగా భారత్కు భారీ టెన్నిస్ టెస్ట్! డేవిస్ కప్ (Davis Cup) క్వాలిఫయర్స్ రెండో రౌండ్లో కొరియాతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఒలింపిక్ టెన్నిస్ సెంటర్లో హార్డ్ కోర్టుపై ఈ పోరు జరగనుంది. హార్డ్ కోర్టు ఎంచుకోవడం కొరియాకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ఆ కోర్టులపై కొరియా ఆటగాళ్లకు మంచి అనుభవం ఉంది. భారత్ ప్రస్తుతం 19వ ర్యాంక్లో ఉంది. కొరియా 16వ స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్లోనూ కొరియాదే 6-5తో స్వల్ప ఆధిక్యం. భారత్ ఆగస్టు 10న జట్టును ప్రకటించనుంది. గతంలో ఇరు జట్లు 2016లో తలపడ్డాయి.
చండీగఢ్లో జరిగిన గ్రూప్-1 మ్యాచ్లో భారత్ 4-1తో గెలిచింది. అప్పట్లో మ్యాచ్ గడ్డిపై జరిగింది. కొరియా హార్డ్ కోర్టులో బలంగా ఉండటంతో భారత్ ఆ సమయంలో గ్రాస్ను ఎంచుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ నెదర్లాండ్స్ను 3-2తో ఓడించింది. బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్లో దక్షిణేశ్వర్ సురేశ్ హీరోగా నిలిచాడు. రెండు సింగిల్స్ మ్యాచ్లతో పాటు యుకీ భాంబ్రితో కలిసి డబుల్స్లోనూ అతను గెలిచాడు. ఐదో మ్యాచ్లో గై డెన్ ఔడెన్ను 6-4, 7-6(4)తో ఓడించి భారత్ను గెలిపించాడు.
ప్రస్తుత క్వాలిఫయర్స్ విధానం 2019లో మొదలైన తర్వాత భారత్ రెండో రౌండ్కు రావడం ఇదే తొలిసారి. కొరియా కూడా తక్కువేమీ కాదు. బుసాన్లో 2016 ఛాంపియన్ అర్జెంటీనాను 3-2తో ఓడించి రెండో రౌండ్లోకి వచ్చింది. క్వాన్ సూన్వూ ఆ విజయానికి కీలకంగా నిలిచాడు. సైనిక సేవను పూర్తి చేస్తూనే అతను కొరియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక సియోల్ పోరు పూర్తిగా కీలకం. గెలిచిన జట్టు నవంబర్లో జరిగే డేవిస్ కప్ ఫైనల్-8కు చేరుతుంది. కొరియా 2022, 2023లో 16 జట్ల డేవిస్ కప్ ఫైనల్స్లో ఆడింది.

