కలం, మహబూబ్నగర్ బ్యూరో: మహబూబ్నగర్ (Mahabubnagar) పట్టణంలోని బీకే రెడ్డి కాలనీలో ఉన్న ప్రశాంతి నికేతన్ హైస్కూల్ యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫీజులు చెల్లించలేదనే కారణంతో ఫార్మేటివ్ అసెస్మెంట్-1 పరీక్షలు రాయనీయకుండా సుమారు 40 మంది విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై విద్యార్థుల తల్లిదండ్రులు చైల్డ్ హెల్ప్లైన్ 1098ను సంప్రదించారు.
మహబూబ్నగర్ పట్టణానికి చెందిన ఖజామొయినుద్దిన్ తన పిల్లలను కూడా పరీక్షలకు అనుమతించకుండా బహిరంగంగా అవమానించారని ఆరోపిస్తూ చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ (Child Welfare Committee)కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్తో పాటు సిబ్బంది విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై చిల్డ్రన్స్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మహమ్మద్ నయీమొద్దీన్ విచారణ చేపట్టారు. విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

