కలం, స్పోర్ట్స్: శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు టీమిండియా (India vs Sri Lanka) సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో హర్ష్ దూబే (Harsh Dubey), శివాంగ్ కుమార్ (Shivang Kumar), తనుష్ కోటియన్ (Tanush Kotian), విప్రాజ్ నిగమ్ (Vipraj Nigam) నెట్ బౌలర్లుగా భారత జట్టుతో చేరారు. శుభ్మన్ గిల్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్లలో వీరు భారత బ్యాటర్లకు బౌలింగ్ చేయనున్నారు. భారత జట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. ఆగస్టు 7 నుంచి కొలంబోలోని నాన్డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ మైదానంలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ తర్వాత టెస్టు సిరీస్కు తుది సన్నాహాలు పూర్తవుతాయి. మొదటి టెస్టు ఆగస్టు 15 నుంచి 19వ తేదీ వరకు గాలేలో జరుగుతుంది. రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి 27వ తేదీ వరకు కొలంబోలోని సిన్హలీస్ స్పోర్ట్స్ క్లబ్లో నిర్వహించనున్నారు. అయితే సిరీస్కు ముందు గాయాలు భారత జట్టును ఇబ్బంది పెడుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా కోలుకోకపోవడంతో సిరీస్కు దూరమయ్యాడు.
అతని స్థానంలో ఆకిబ్ నబీని ఎంపిక చేశారు. హర్షిత్ రాణా హామ్స్ట్రింగ్ గాయంతో అందుబాటులో లేడు. నితీశ్ కుమార్ రెడ్డి ఇంకా కోలుకుంటున్నాడు. వాషింగ్టన్ సుందర్ తొలి టెస్టుకు దూరం కానున్నాడు. ఆకాష్ దీప్ కూడా ఇంకా ఫిట్గా లేడు. ఈ రెండు టెస్టులు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 సైకిల్లో భాగం. ప్రస్తుతం భారత్ పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్ బౌలర్ల చేరికతో జట్టు సన్నాహాలకు మరింత బలం చేకూరనుంది.

