కలం, వెబ్డెస్క్: రాష్ట్రంలో అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారని, చంద్రబాబు వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు అన్నీ కష్టాలే మిగిలాయని వైఎస్ జగన్ (YS Jagan) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్ నేడు పర్యటించారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
ఈ సందర్భంగా జగన్ (YS Jagan) మాట్లాడుతూ.. రాష్ట్రంలో పొగాకు రైతులు (Tobacco Farmers) పరిస్థితి దారుణంగా ఉందన్నారు. రాష్ట్రంలో 67 శాతం జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 24 నెలలుగా కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వడం లేదన్నారు. మొక్కజొన్న, వరి, పత్తి, పెసర్లు, మినుములు, మిర్చి, సజ్జలు, చీని, పొగాకు, ఆక్వా రైతులు ఎవ్వరికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదన్నారు. ఇటీవల తన పర్యటన ఖరారైన నేపథ్యంలో పొగాకుకు కొంత ధర పెరిగిందని జగన్ అన్నారు.
మరోవైపు జగన్ పర్యటనలో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ హెలీకాఫ్టర్ దిగిన సమయంలో అక్కడ పోలీసులు లేకపోవడంతో అభిమానులు హెలీప్యాడ్ వరకు దూసుకొచ్చారు. జగన్ భద్రతను ప్రభుత్వం గాలికొదిలేసిందని వైసీపీ నేతలు, కార్యకర్తలు విమర్శిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో విధించిన ఆంక్షల పైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు వైసీపీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారు.
Also Read : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. దేశంలోనే ఫస్ట్!
Follow Us On : WhatsApp

