కలం, నిర్మల్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో నిర్మల్ పోలీసులు (Nirmal Police) మరోసారి విజయవంతమయ్యారు. సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన 112 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేస్తే, ఫోన్ను గుర్తించి తిరిగి అప్పగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 2,377 మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు అవి చోరీకి గురైనవో కాదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. మార్కెట్లు, బస్ స్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమ మొబైల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయికిరణ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

