కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS) మూడేళ్లలోపు 1000 రోబోటిక్ సహాయక శస్త్ర చికిత్సలు (NIMS Robotic Surgeries) విజయవంతంగా పూర్తి చేసి కీలక చరిత్రాత్మక ఘనత సాధించింది. ఈ చరిత్రాత్మక ఘనత సాధించడంపై సీఎం రేవంత్ రెడ్డి నిమ్స్ వైద్య బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ తో పాటు వైద్య బృందం, సిబ్బందిని అభినందించిన సీఎం.. అధునూతన వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి ఈ ఘనత నిదర్శనమని కొనియాడారు.
కాగా, మూడేళ్లలోపు మొత్తం 1000 సర్జరీలను నిమ్స్ వైద్య బృందం నిర్వహించగా.. ఇందులో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 248, సర్జికల్ ఆంకాలజీ 162 శస్త్రచికిత్సలు నిర్వహించింది. క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, క్లిష్టమైన సర్జరీలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించడం విశేషం. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ అందించిన మార్గదర్శకం, సహకారంతోనే ఈ మైలురాయి సాధ్యమైందని నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ తెలిపారు.

