కలం, మిర్యాలగూడ : ఉపాధ్యాయ వృత్తి అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేసే అత్యంత బాధ్యతాయుతమైన సేవా మార్గమని మిర్యాలగూడ (Miryalaguda) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (MLA Bathula) అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు జొన్నలగడ్డ భాస్కర్ రెడ్డి దంపతుల సన్మాన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, భాస్కర్ రెడ్డి దంపతులను శాలువా, పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఒక మంచి ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థులలో నైతిక విలువలు, క్రమశిక్షణ, మానవత్వాన్ని పెంపొందిస్తారని అన్నారు. భాస్కర్ రెడ్డి తన సుదీర్ఘ సేవా కాలంలో నిబద్ధత, నిజాయితీతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దారని కొనియాడారు. పదవీ విరమణ అనేది సేవలకు ముగింపు కాదని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది మాత్రమేనని పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి అనుభవం, మార్గదర్శకత్వం భవిష్యత్తులో కూడా సమాజానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే (MLA Bathula) తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : ‘జంతర్ మంతర్’ ధర్నాలపై పిటీషన్: సుప్రీం కీలక వ్యాఖ్యలు!
Follow Us On : WhatsApp

