కలం, వెబ్ డెస్క్: కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ విస్తరణ (Karnataka Cabinet Expansion)కు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా కొత్త మంత్రుల చేరికకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ లేఖ విడుదల చేశారు. కొత్త కేబినెట్లో 20 మంది మంత్రులకు అవకాశం కల్పిస్తూ జాబితా ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ పదవులకు కూడా పేర్లు వెల్లడించారు. ఈ లేఖను కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్కు పంపించారు. అనంతర చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు.
కొత్త మంత్రులు వీరే..
కొత్తగా మంత్రులుగా పి.ఎం. నరేంద్రస్వామి, శివరాజ్ తంగడగి, రుద్రప్ప లమాని, కె.ఎస్. బసవంతప్ప, బి. నాగేంద్ర, టి. రఘుమూర్తి, బి.జెడ్. జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, సంతోష్ లాడ్, మధు బంగారప్ప, పుట్టరంగశెట్టి, మంకాళ వైద్య, డా.అజయ్ సింగ్, ఎన్. చలువరాయ స్వామి, కె.ఎం. శివలింగ గౌడ, హెచ్.సి. బాలకృష్ణ, గాయత్రి శాంతే గౌడ, బసవరాజ్ రాయరెడ్డి, విజయానంద కాశప్పనవర్, లక్ష్మణ సవాది లను ప్రకటించారు.
అసెంబ్లీ స్పీకర్ ఎవరంటే!
శాసనసభ (అసెంబ్లీ), శాసన మండలి పదవులకు సైతం అధిష్టానం ఆమోదం తెలిపింది. అసెంబ్లీ స్పీకర్ గా జి.ఎస్. పాటిల్, డిప్యూటీ స్పీకర్ గా ఏ.ఎస్. పొన్నన్న, శాసన మండలి చైర్పర్సన్ గా సలీం అహ్మద్, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ గా ఉమాశ్రీలను నియమిస్తూ ఆమోదం తెలిపారు.

