కలం, భువనగిరి: పర్యావరణం బాగుంటేనే మానవ మనుగడ సురక్షితంగా ఉంటుందని, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారానే స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం సిద్ధిస్తుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbham Anil Kumar Reddy) అన్నారు. భువనగిరి పట్టణంలోని స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.
భువనగిరి (Bhuvanagiri) నియోజకవర్గంలో 5 నుంచి 6 లక్షల మొక్కలు నాటడమే ధ్యేయంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఒక్క భువనగిరి పట్టణంలోనే 60 వేల మొక్కలు నాటే లక్ష్యంతో ఈ వన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ‘మొక్కలు నాటడంతోనే మన పని అయిపోలేదు.. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటూ పెంచడమే మనందరి ప్రాథమిక బాధ్యత. భావితరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలి.’ అని కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
వన మహోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి–రవికుమార్, వైస్ చైర్పర్సన్ పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, అటవీ, మున్సిపల్ సిబ్బంది, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ, భువనగిరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : హేట్ స్పీచ్ బిల్లుపై ఎమ్మెల్యే కూనంనేని కీలక సూచనలు
Follow Us On : WhatsApp

