కలం, వెబ్ డెస్క్: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) వ్యాఖ్యానించారు. శనివారం విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రామ్మోహన్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు భోగాపురం ఎయిర్పోర్ట్ (Bhogapuram Airport) సింహద్వారమని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధి కేంద్రంగా భోగాపురం మారనుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ పాలనలో యువతకు ఉద్యోగావకాశాలు పెరగబోతున్నాయని అన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకున్నట్టే.. ఏపీ ప్రగతి కోసం భోగాపురం రూపంలో ఉత్తరాంధ్ర ఉత్తర ద్వారం ఇవాళ తెరుచుకోబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భోగాపురం విత్తనం వేసింది ఒకే ఒక్క నాయకుడు.. చంద్రబాబు అని కొనియాడారు. ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి, ఎర్ర బస్సు కూడా రాదని ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు భోగాపురం అభివృద్ధి సమాధానం చెబుతోందని విమర్శించారు. అమెరికా వెళ్లినా, ఆస్ట్రేలియా వెళ్లినా ఎక్కడికి వెళ్తున్నారంటే.. అల్లూరి సీతారామరాజు తాలూకా గడ్డ భోగాపురం విమానాశ్రయానికి వెళ్తున్నామని గర్వంగా చెప్పుకునేలా కేంద్రం పేరు పెట్టిందని కొనియాడారు.

