కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఆందోళనల సమయంలో యువత వ్యవహరించిన తీరు, మాట్లాడిన అసభ్యకర మాటలను దేశమంతా చూసిందని ఆయన పేర్కొన్నారు. నిరసనల్లో భాగంగా కొందరు యువకులు తననే కాకుండా, తన తల్లిని కూడా దూషించారని ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. అయితే చిన్నతనంలో పొరపాట్లు చేయడం సహజమని, అందుకే తనను, తన తల్లిని దూషించిన యువతను తాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
యువతను శిక్షించడం లేదా వేధించడం వల్ల ఎలాంటి సమస్యలు పరిష్కారం కావని ప్రధాని స్పష్టం చేశారు. దారి తప్పిన పిల్లలకు సరైన మార్గం చూపించడమే సమాజం యొక్క బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. గతంలో చేసిన తప్పుల నుంచి యువత తగిన పాఠాలు నేర్చుకోవాలని, దూషణల వల్ల ఏదీ సాధించలేమని హితవు పలికారు. దేశ పురోగతి కోసం, అభివృద్ధి కోసం యువత అంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని, దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా కోరారు.

