కలం, నిర్మల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భైంసా పట్టణంలో శనివారం భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. పురాణబజార్ లోని మార్వాడి భవన్ నుంచి విఠలేశ్వరుని పల్లకీ శోభాయాత్రను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (MLA Pawar Ramarao Patel) ప్రారంభించారు. పట్టణ ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విఠల–రుక్మిణి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చిన్నారులు విఠల్, రుక్మిణి, భక్త తుకారం వేషధారణలో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ.. వార్కరి సంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ఒకటని అన్నారు. భగవంతుని నామస్మరణతో సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందడంతో పాటు ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడిచేలా ఈ సంప్రదాయం ప్రేరణ కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో విలువలు, భక్తి భావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

