కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)లో ఓ అనాథ మృతదేహానికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ (Indur Yuvatha Association) అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడి తరఫున కుటుంబసభ్యులు గానీ, బంధువులు గానీ ఎవరూ వచ్చి గుర్తించలేదు. దీంతో చట్టపరమైన ప్రక్రియ అనంతరం పోలీసు అధికారులు ఆ మృతదేహాన్ని అనాధగా నిర్ధారించారు.
పోలీసుల విజ్ఞప్తి మేరకు నిజామాబాద్ దేవి థియేటర్ పక్కన ఉన్న సార్వజనిక శ్మశానవాటికలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సంప్రదాయ పద్ధతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మనిషి జీవితానికి చివరి గౌరవం దక్కేలా చూడటం కూడా సమాజ బాధ్యత అనే భావనతో, దిక్కులేని మృతదేహానికి అంతిమ వీడ్కోలు పలికామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకురి సాయిబాబు తెలిపారు . అలాగే
ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి మాట్లాడుతూ.. అనాథ శవానికి అంతిమ సంస్కారాల చేయడమంటే అశ్వమేధ యాగం చేయడంతో సమానమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు వాల బాలకిషన్, కొండా నాగేందర్, సుధాకర్, వినయ్,రాజు, అఫ్రోజ్, దర్శనం రాజు, సాయి, 1వ టౌన్ పోలీస్ సిబ్బంది భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

