గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్.. డోప్ టెస్ట్‌లో భారత్‌కు షాక్

కలం, స్పోర్ట్స్​ : గ్లాస్గో 2026 కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games) ప్రారంభోత్సవం రోజే భారత బృందానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 73 కేజీల విభాగంలో పోటీపడాల్సిన భారత జూడో ప్లేయర్ అరుణ్ కుమార్ (Arun Kumar) డోపింగ్ పరీక్షలో విఫలమై టోర్నీ నుంచి వైదొలిగారు. నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) నిర్వహించిన అవుట్-ఆఫ్-కాంపిటీషన్ పరీక్షలో నిషేధిత పదార్థాలు వాడుతున్నట్లు తేలడంతో ఆయనపై ఈ అనర్హత వేటు పడింది. అరుణ్ కుమార్ జూనియర్, సీనియర్ స్థాయిల్లో అద్భుతంగా రాణించి, జూడోలో భారత్‌కు పతకం తెచ్చే ప్రధాన క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు.

ఇంస్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ పొందిన ఆయన, 2023 మకావు జూనియర్ ఏషియన్ కప్‌లో పసిడి పతకం సాధించారు. ఆ తర్వాత 2025 తైపీ ఏషియన్ ఓపెన్‌లో స్వర్ణం, హాంగ్‌కాంగ్ ఏషియన్ ఓపెన్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఈ ఏడాది తాష్కెంట్ గ్రాండ్ స్లామ్‌లో ఏడో స్థానంలో నిలిచి, తొలిసారిగా కామన్వెల్త్ గేమ్స్‌కు ఎంపికయ్యారు. పోటీలకు ముందే క్రీడాకారులకు కఠినమైన డోపింగ్ పరీక్షలు నిర్వహించారు.

గ్లాస్గో బయలుదేరే ముందు భారత అథ్లెట్లకు రెండు విడతలుగా నాడా పరీక్షలు చేసింది. విదేశాల్లో శిక్షణ పొందుతున్న వారికి అక్కడ ఉన్న యాంటీ డోపింగ్ ఏజెన్సీల సాయంతో పరీక్షలు పూర్తి చేశారు. ఇటీవలి కాలంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో వరుసగా డోపింగ్ కేసులు వెలుగుచూడటంతో ఈ నిఘాను మరింత పెంచారు. వెయిట్‌లిఫ్టింగ్‌లో పలువురు క్రీడాకారులు పట్టుబడటంతో, భారత వెయిట్‌లిఫ్టింగ్ కోటా 16 నుంచి 12కు తగ్గిపోయింది.

ఈ క్రమంలోనే నాడా, అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్, జాతీయ క్రీడా సమాఖ్యలు క్రీడాకారులకు డోపింగ్ నియమాలపై అవగాహన కల్పిస్తూ నిరంతరం పర్యవేక్షించాయి. భారత్ మొదట 126 మంది అథ్లెట్ల బృందాన్ని గ్లాస్గోకు ఖరారు చేసింది. అయితే ఇటీవల జరిగిన కొన్ని తొలగింపులతో ఆ సంఖ్య 125కి తగ్గింది. ఇప్పుడు అరుణ్ కుమార్ కూడా వైదొలగడంతో భారత అథ్లెట్ల సంఖ్య 124కి చేరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>