కలం, నిర్మల్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రంజిత్ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.1 కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని ఆయన కోరారు. అలాగే ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటనపై నైతిక బాధ్యత వహించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

