కలం, కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత, సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం, ధర్మం అంటూ మాటలకే పరిమితం కాకుండా, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నరేందర్ రెడ్డి కలెక్టరేట్ రోడ్డులోని ఓ టీ హోటల్లో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. పలువురి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
అక్రమంగా అరెస్ట్..
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రధాని నివాసం ముందు శాంతియుత ధర్నాకు దిగితే వారిని అక్రమంగా అరెస్టు చేశారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఈ చర్చ కార్యక్రమంలో న్యాయవాదులు కొరివి వేణుగోపాల్,పెంచాల లక్ష్మణ్ రావు, డాక్టర్లు చాట్ల శ్రీధర్, వొడ్డే రాంరెడ్డి వాకర్స్ గుడిపాటి రమణారెడ్డి, కిషన్ రావు, ఎల్లారెడ్డి, బోయిని అశోక్, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా వెంటనే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

