కలం, స్పోర్ట్స్: నీట్ పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ.. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) స్పందించాడు. పిల్లలు, విద్యార్థులు, ప్రతి పౌరుడు ప్రశాంతంగా చదువుకుని, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలని కోరాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా యువరాజ్ తన సందేశాన్ని పంచుకున్నాడు. దేశ భవిష్యత్తు కోసం సంభాషణ ద్వారానే స్నేహపూర్వక పరిష్కారం సాధ్యమని పేర్కొన్నాడు. శాంతి, భద్రత, ఆశతో కూడిన సమాజాన్ని కలిసి నిర్మించాలని పిలుపునిచ్చాడు.
జూలై 20న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ‘సంసద్ చలో’ నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసుల చర్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా విమర్శించారు. నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారని ఆరోపించారు. ఇదే సమయంలో నీట్-యూజీ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధమని తెలిపినా, ప్రతిపక్షం కొత్త షరతులు పెట్టకూడదని స్పష్టం చేసింది.
దీంతో లోక్సభ, రాజ్యసభ రెండూ పలుమార్లు వాయిదా పడ్డాయి. నిరసనల ఘటనపై ఢిల్లీ పోలీసులు 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మరోవైపు, పోలీసుల బలప్రయోగంపై దాఖలైన మూడు ప్రజాహిత వ్యాజ్యాలపై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్తో పాటు అన్ని ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని ఆదేశించింది.

