కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ మురళీకృష్ణ ఆలయం నుంచి బుధవారం నిర్వహించిన శ్రీ జగన్నాథ రథయాత్ర భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా సాగింది. ఈ రథయాత్రలో నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని భక్తులతో కలిసి స్వామివారి రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగన్నాథ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. గాంధీచౌక్ మురళీకృష్ణ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర బుధవార్పేట్, పాత బస్టాండ్, వివేకానంద చౌక్, జయశంకర్ చౌక్, నగేశ్వరవాడ, చింతకుంటవాడ, టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా ఘనంగా కొనసాగింది. మార్గమధ్యంలో భక్తులు స్వామివారికి హారతులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

