కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గాంధీ భవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఇతర బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడాన్ని పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భండారి శాంతి కుమార్ (Bhandari Shanthi Kumar) తీవ్రంగా ఖండించారు. బుధవారం తన ఇంట్లో ఏర్పాటుచేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నివాసం వద్ద అరాచకానికి పాల్పడి దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల చర్యలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న బీజేపీ నాయకులను అడ్డుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు.
ఒకవైపు ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు ప్రతిపక్షాల గొంతును పోలీసుల ద్వారా నొక్కివేయాలని ప్రయత్నించడం కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుతో వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తోందని మండిపడ్డారు. పోలీసు నిర్బంధాలు, అక్రమ అరెస్టులతో బీజేపీ నాయకులను, కార్యకర్తలను భయపెట్టలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక, నియంతృత్వ ధోరణులపై బీజేపీ పోరాటం మరింత ఉద్ధృతంగా కొనసాగుతుందని శాంతికుమార్ (Bhandari Shanthi Kumar) హెచ్చరించారు.
Read Also: మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Follow Us On : WhatsApp

