కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Trump) జెనరిక్ ఔషధాల దిగుమతులపై కీలక ప్రకటన చేశారు. 2026 ఆగస్టు 1 నుండి అమలులోకి వచ్చేలా, అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జెనరిక్ మందులపై రాబోయే రెండేళ్ల పాటు సున్నా శాతం సుంకం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆ తర్వాత ఏడాది ఈ సుంకాన్ని 100 శాతానికి పెంచుతామని, ఆపై దానిని ఏకంగా 200 శాతానికి పెంచడం జరుగుతుందని ట్రంప్ తన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
జెనరిక్ ఔషధాల ఉత్పాదకతను తిరిగి అమెరికా దేశీయ మార్కెట్ లోకి తీసుకురావడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. నిర్దేశిత గడువులోగా అమెరికాలో సొంత ప్లాంట్లు, ఉత్పాదక పరికరాలను ఏర్పాటు చేయని ఫార్మా కంపెనీలపై పెనాల్టీగా ఈ భారీ సుంకాలను విధిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను రక్షించడమే ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యమని చెప్పారు. కాగా, పేటెంట్ పొందిన, బ్రాండెడ్, ఇన్నోవేటివ్ ఔషధాలపై ప్రస్తుతం ఉన్న విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని, అవి యథాతథంగా కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా అంతటా మునుపెన్నడూ లేని స్థాయిలో ఫార్మా ఉత్పాదక కేంద్రాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని ట్రంప్ (Trump) ఈ సందర్భంగా వెల్లడించారు.

