కలం, ఖమ్మం బ్యూరో: తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఖానాపురం హవేలి పోలీసులు (Khanapuram Haveli Police) అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇన్స్పెక్టర్ భానుప్రకాష్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం (Khammam) జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామానికి చెందిన లంజపల్లి శేఖర్ అలియాస్ టోనీ (31) ఖమ్మంలోని చర్చి కాంపౌండ్లో నివాసముంటూ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన నిందితుడు పగటిపూట ఆటోలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను ముందుగానే గుర్తించేవాడు. ఆ ఇళ్ల లొకేషన్లను తన సెల్ఫోన్లో సేవ్ చేసుకొని, రాత్రి వేళల్లో వాటి తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడేవాడు.
ఈ క్రమంలోనే ఇటీవల రాత్రి సమయంలో రుద్రంకోటలోని ఒక ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన వస్తువులను చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఖానాపురం హవేలి పోలీసులు పక్కా సమాచారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 31.263 గ్రాముల బంగారు స్వాతిహారం, 9.530 గ్రాముల బంగారు జూకాలు, మాటీలు, ఒక మోటరోలా ఆండ్రాయిడ్ సెల్ఫోన్, ఒక వివో సెల్ఫోన్తో పాటు నేరాలకు ఉపయోగించిన బజాజ్ డీజిల్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో ఖమ్మం (Khammam) అర్బన్, కొణిజర్ల, చింతకాని, రఘునాథపాలెం తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన పలు ఇళ్ల దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా తన ప్రమేయం ఉన్నట్లు అంగీకరించాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Read Also: నెరవేరిన భువనగిరి రైతుల దశాబ్దాల కల..!
Follow Us On: Sharechat

