కలం, స్పోర్ట్స్ : స్పెయిన్కు ప్రపంచకప్ అందించిన హీరోగా ఫెర్రాన్ టొరెస్ (Ferran Torres) నిలిచాడు. కానీ అతనికి భారత్తోనూ ఓ ప్రత్యేక అనుబంధం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ హీరోగా మారకముందే భారత అభిమానులకు అతను పరిచయం అయ్యాడు. 2017 ఫిఫా అండర్-17 వరల్డ్ కప్ కోసం ఫెర్రాన్ టొరెస్ భారత్కు వచ్చాడు. అప్పటికి అతని వయసు కేవలం 17 ఏళ్లు. స్పెయిన్ జట్టులో కీలక ఆటగాడిగా ఆడాడు. రెండు గోల్స్, రెండు అసిస్టులతో జట్టును ఫైనల్కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో స్పెయిన్ ఓడిపోయి రన్నరప్గా నిలిచింది.
కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, కోల్కతాలోని వివేకానంద యువభారతి క్రీడాంగణంలో భారత అభిమానులు అతని ఆటను తొలిసారి చూశారు. అదే టోర్నీలో ఆడిన ఎరిక్ గార్సియా కూడా ఇప్పుడు స్పెయిన్ వరల్డ్ కప్ విజేత జట్టులో సభ్యుడిగా నిలిచాడు. ఫైనల్లో అతను 21 నిమిషాలు ఆడాడు. 2026 వరల్డ్ కప్ ఫైనల్లో ఫెర్రాన్ టొరెస్ చరిత్ర సృష్టించాడు. అదనపు సమయంలో 106వ నిమిషంలో ఎడమ కాలితో అద్భుత గోల్ చేశాడు.
నికో విలియమ్స్ హెడ్డర్ పోస్ట్ను తాకి తిరిగి రాగానే, ఒక్క క్షణం కూడా వృథా చేయకుండా బంతిని నెట్లోకి పంపించాడు. ఆ గోల్తో స్పెయిన్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. ఫెర్రాన్ టొరెస్కు ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా దక్కింది. ఈ గోల్తో ఫెర్రాన్ మరో అరుదైన ఘనత సాధించాడు. స్పెయిన్కు వరల్డ్ కప్ విజేత గోల్ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
అంతకుముందు ఈ ఘనత ఆండ్రెస్ ఇనియెస్టా పేరిట మాత్రమే ఉండేది. బార్సిలోనా తరఫున వేలాది మంది అభిమానుల ముందు ఆడిన అనుభవం ఫెర్రాన్కు ఉన్నా, అతని కెరీర్లో తొలి పెద్ద అంతర్జాతీయ టోర్నీ జ్ఞాపకాలు మాత్రం భారత్తోనే ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు అదే ఆటగాడు ప్రపంచకప్ ఫైనల్ హీరోగా చరిత్రలో నిలిచిపోయాడు.

