కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి దూరం కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. టేకులపల్లి (Tekulapalli) మండలం హనుమతండా గ్రామానికి చెందిన గూగులోతు శ్రీకాంత్ (25) కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఆమె దూరం కావడంతో అతడు తీవ్ర మానసిక వేదనకు గురై.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఘటన అనంతరం కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్లో “మిస్ యూ అమ్మా నాన్న” అని రాసి ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

