కలం, వెబ్ డెస్క్: జగన్ మరోసారి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుంటుందని, ప్రజల జీవితాలు బాగుపడుతాయని ముద్రగడ పద్మనాభం భావించేవారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) అన్నారు. మరోసారి జగన్ను సీఎంగా చేయాలనే బలమైన కాంక్షతో 2024లో పార్టీలో చేరారని గుర్తు చేశారు.
మనుషుల్లో మహనీయుడు ముద్రగడ అని, విలువలతో కూడిన రాజకీయాలు చేశారని కొనియాడారు. ఇటీవల ముద్రగడ మరణించిన నేపథ్యంలో కాకినాడలోని కిర్లంపూడిలో ఆయన నివాసానికి వెళ్లారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పదవులు ఆశించని వ్యక్తి..
ముద్రగడ తన రాజకీయ జీవితంలో ఏనాడూ పదవులు ఆశించలేదని సజ్జల కొనియాడారు. తమ పార్టీలో చేరాక కూడా.. ఆయన ఎలాంటి పదవులు అడిగింది లేదన్నారు. కేవలం జగన్ మరోసారి అధికారంలోకి రావాలని కోరుకునేవారని వెల్లడించారు.
కాపు ఉద్యమంలోనూ వెనుకబాటుతనం ఉంటుందని ముద్రగడ బలంగా నమ్మారని వివరించారు. అందుకే, ఆయన చేపట్టిన ఉద్యమానికి ఎంతో మద్దతు లభించిందన్నారు. ముద్రగడ మరణం వైసీపీకి తీరని లోటని స్పష్టం చేశారు.

