కలం, నిర్మల్: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా కాకుండా సంక్షేమ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. ఇన్సూరెన్స్ కంపెనీలకు స్కీములను అప్పగిస్తూ జారీ చేసిన జీఓ నెం. 12ను వెంటనే రద్దు చేయాలని, సీఎస్సీ సంస్థ నిర్వహిస్తున్న హెల్త్ టెస్టులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ క్లెయిమ్లకు నిధులు విడుదల చేయడంతో పాటు సహజ మరణ పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచాలని కోరారు.
అలాగే రెన్యువల్ కాని లేబర్ కార్డులను వెంటనే పునరుద్ధరించి, కార్మికుల సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రాకేష్, మల్లేష్, శంకర్, లింగం, రాజేష్, ప్రదీప్, ప్రశాంత్, నరేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

