కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు కలకలం రేగింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) తనను లైంగికంగా వేధిస్తున్నారని ట్రైనీ మహిళా ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో ఉన్న అంశాలివే..
బాధితురాలు ఫిర్యాదు చేసిన ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి కొంతకాలంగా తన ప్రతిష్ఠ, వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని సదరు ట్రైనీ ఫిర్యాదు చేశారు. తన వాట్సాప్ నెంబరుకి అసభ్యకరమైన, లైంగికంగా వేధించేలా మెస్సేజులు పంపిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జులై 8న తన గదికి వెళ్లి మొబైల్ ఫోన్ లాక్కుని, ఫోన్ పాస్వర్డ్ చెప్పాలని బలవంతం చేసినట్లు వివరించారు. తన అనుమతి లేకుండా వ్యక్తిగత వీడియోను రికార్డు చేసి, తన భర్తకే పంపిస్తానని బెదిరించారని తెలిపారు.
మెడపై కత్తి పెట్టి..
జులై 9వ తేదీన జరిగిన ఘటన గురించి బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. ఆ రోజు రాత్రి సుమారు 9 గంటల సమయంలో తనను ఉదయ్ కృష్ణారెడ్డి (Uday Krishna Reddy) బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి, జుట్టు పట్టుకుని లాగారని పేర్కొన్నారు. అంతేగాకుండా, గొంతు నులిమి, మెడకు కత్తి పెట్టి బెదిరించినట్లు కూడా స్పష్టం చేశారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని.. జులై పదో తేదీన ఉదయం తనపై లైంగిక దాడి చేసేందుకు కూడా యత్నించారని సంచలన ఆరోపణలు చేశారు.
పోలీస్ అకాడమీలో దర్యాప్తు..
ట్రైనీ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం, అకాడమీకి వెళ్లి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు మొదట పోలీస్ అకాడమీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. వారి సూచనలతోనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లినట్లు సమాచారం.
కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారిగా..
ఏపీకి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి.. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి సుపరిచితమైన వ్యక్తి. కానిస్టేబుల్ గా పనిచేస్తున్నప్పుడు ఉన్నతాధికారి అవమానించడంతో.. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ కు ప్రిపేర్ అయి.. చివరికి ఐపీఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యారు. ఇంటర్వ్యూల ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయనపై తాజాగా నమోదైన కేసు.. సంచలనంగా మారింది.
Read Also: ఆర్మూర్లో వేడెక్కిన రాజకీయం.. కాంగ్రెస్, బీజేపీ బిగ్ ఫైట్!
Follow Us On: X(Twitter)

