కలం, వెబ్ డెస్క్ : కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 విద్యా సంవత్సరానికి గానూ నిర్వహించిన 10వ తరగతి రెండో విడత బోర్డు పరీక్షల ఫలితాలను (CBSE Result) అధికారికంగా విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ రిజల్ట్స్ పోర్టల్ ద్వారా చూసుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) పరిధిలో భాగంగా ఈ ఏడాది దేశంలోనే మొదటిసారిగా 10వ తరగతి విద్యార్థులకు రెండు బోర్డు పరీక్షలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17 నుండి మార్చి 11 వరకు ప్రధాన పరీక్షలు జరగగా, మే 15 నుండి మే 21 వరకు రెండో విడత పరీక్షలను బోర్డు విజయవంతంగా పూర్తి చేసింది.
ఈ రెండో విడత పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 6,63,777 మంది విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులను మరింత మెరుగుపర్చుకోవాలనే లక్ష్యంతో 5,13,955 మంది విద్యార్థులు ఈ రెండో విడత పరీక్షకు హాజరయ్యారు. మొదటి విడత ప్రధాన పరీక్షలు, రెండో విడత పరీక్షల ఫలితాలను రెండింటినీ క్రోడీకరించి బోర్డు తుది ఉత్తీర్ణతను ప్రకటించింది. ఈ రెండు ఫలితాల కలయికతో సీబీఎస్ఈ 10వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం అత్యధికంగా 96.78 శాతంగా నమోదైనట్లు బోర్డు ఉన్నతాధికారులు వెల్లడించారు.

