కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ ప్రజల దశాబ్దాల కల అయిన అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే (Balkonda MLA) వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) శాంతియుత ‘కఠోర నిరాహార దీక్ష’ను తలపెట్టారు. ఈ దీక్షను పోలీసు బలగాలతో అడ్డుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాక్షస చర్యకు నిదర్శనం అని వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజా సమస్యల సాధన కోసం తాను అహింసా మార్గంలో నిరసన తెలియజేస్తుంటే, ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపాలని చూడటం శోచనీయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరై, దాదాపు 75 శాతం పనులు పూర్తి చేసుకున్న భీంగల్ 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, భీంగల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పూర్తి చేయాలని, మూతపడిన భీంగల్ బస్ డిపోను పునఃప్రారంభించాలని కోరారు.
గత మున్సిపల్ ఎన్నికల ముందు రూ. 12 కోట్ల నిధులతో ప్రారంభించిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పెండింగ్ పనుల సాధన కోసమే 15వ తేదీన చుక్క మంచి నీరు కూడా ముట్టకుండా ఒక రోజు కఠోర నిరాహార దీక్షకు పూనుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఎలాంటి రాస్తారోకోలు, ధర్నాలు చేయకుండా, తనకు తాను శిక్ష వేసుకుంటూ అత్యంత శాంతియుతంగా ఒకరోజు దీక్ష చేస్తానని ప్రకటిస్తే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

