కలం, నిర్మల్: గ్రామ పంచాయతీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ రూరల్ మండల సర్పంచులు (Nirmal Sarpanches) మంగళవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Bhavesh Mishra)కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. రెండో విడతలో అర్హులైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామాల్లో సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు త్వరితగతిన ఇళ్ల మంజూరు చేయడం అవసరమని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీలపై విద్యుత్ బిల్లుల భారం రోజురోజుకు పెరుగుతోందని, వీధిదీపాలు, తాగునీటి మోటార్ల నిర్వహణకు భారీ మొత్తంలో విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని, దీంతో పంచాయతీల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటోందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, పంచాయతీలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
మహిళా సర్పంచులు ఎక్కడ?
కలెక్టర్కు గ్రామ పంచాయతీల సమస్యలపై వినతిపత్రం సమర్పించిన వారిలో ఎన్నికైన మహిళా సర్పంచులు కనిపించకపోగా, వారి స్థానంలో భర్తలు హాజరై వినతిపత్రం అందజేయడం చర్చనీయాంశమైంది. నిర్మల్ రూరల్ మండలంలోని సగానికి పైగా గ్రామ పంచాయతీలకు మహిళలే ఎన్నికైన సర్పంచులు అయినప్పటికీ, అధికారిక కార్యక్రమాల్లో మాత్రం వారి భర్తలే ముందుండి వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలకు రాజకీయ సాధికారత కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం “సర్పంచ్ పతుల” హవా కొనసాగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సర్పంచులకు బదులుగా వారి భర్తలే వినతిపత్రం సమర్పిస్తున్నా, ఈ అంశంపై అధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం కూడా చర్చకు దారితీసింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.
Read Also : సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన
Follow Us On: Instagram

