కలం, హనుమకొండ: హనుమకొండ (Hanumkonda) జిల్లా భీమదేవరపల్లి (Bhimadevarapalli) లో వర్షాలు కురిసి పంటలు పండాలని కోరుతూ గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి ఆట నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వానదేవుడు కరుణించాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా భూలక్ష్మి కాడ పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నీలాభిషేకాలు చేశారు.
“వానదేవుడు కరుణించి మా మొర ఆలకించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలి.. పంటలు బాగా పండాలి.. రైతులు సుభిక్షంగా ఉండాలి” అని భక్తిశ్రద్ధలతో దేవతలను వేడుకున్నారు. ఇటీవల వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు కలిసి సంప్రదాయ ఆచారాల ప్రకారం కప్పతల్లి ఆట నిర్వహించి వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడం విశేషం. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

