కలం, స్పోర్ట్స్ : టీ20 క్రికెట్లో టీమిండియా ప్రస్తుతం తీవ్ర కష్టాలు పడుతోంది. వరుస పరాజయాల కారణంగా జట్టు బలం, సామర్థ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్పై భారత మాజీ స్టార్ క్రికెటర్ హనుమ విహారీ (Hanuma Vihari) ఘాటు విమర్శలు చేశారు. గంభీర్ వ్యూహాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గంభీర్ తన ఫేవరెట్ ఆటగాళ్లకే జట్టులో అవకాశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు సిరీస్లలో ఓపెనింగ్ స్థానం కోసం తీవ్రమైన ప్రయోగాలు జరిగాయి.
మొదట ఐర్లాండ్తో రెండు మ్యాచ్లు, ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్లో సంజూ శాంసన్కు అవకాశం ఇచ్చారు. మూడు మ్యాచ్ల్లోనూ సంజూ విఫలం కావడంతో అతనిపై వేటు వేశారు. ఆ తర్వాత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తెచ్చారు. కానీ అతను ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ 15 పరుగుల మార్కును దాటలేకపోయాడు. దీనితో ఐదో టీ20 మ్యాచ్ కోసం మళ్లీ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకున్నారు. అయినప్పటికీ భారత్ ఆ మ్యాచ్లోనూ ఓడిపోయింది.
ఈ గందరగోళ సెలెక్షన్లపై హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్లో స్పందించారు. జట్టులో కొంతమంది ఆటగాళ్లు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. శివం దూబే బౌలింగ్ చేయడని, ఫీల్డింగ్ సరిగ్గా లేదని, బ్యాటింగ్లోనూ ఫామ్లో లేడని విమర్శించారు. షెడ్గే ప్రదర్శన కూడా బౌలింగ్, బ్యాటింగ్లో బాగాలేదన్నారు. వాషింగ్టన్ సుందర్ను జట్టులో ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదని, గత కొన్నేళ్లుగా అతని సహకారం పెద్దగా లేదని చెప్పారు.
స్పిన్నర్ల ఎంపికలోనూ లోపాలు ఉన్నాయని విహారి పేర్కొన్నారు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్లతో సమస్యలు ఉన్నప్పుడు రవి బిష్ణోయ్ను ఈ టూర్కు ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఆటగాళ్లకు జట్టులో కనీస భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైభవ్ను ఆడించాలనుకున్నప్పుడు కనీసం ఐదు లేదా ఆరు మ్యాచ్లు అవకాశం ఇవ్వాలని, మూడు మ్యాచ్ల్లోనే తీసేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఆటగాళ్లు రాణించాలంటే వారికి తగిన సమయం ఇవ్వడం ఎంతో ముఖ్యం.

