కలం, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో వినూత్న నిరసన (BRSV protest) కార్యక్రమం చేపట్టారు. “కోసి రక్తం చల్లితే పంటలు పండుతాయి” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు, ముఖ్యమంత్రి రక్త దాహం తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతులకు తక్షణమే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు.
రక్తం అడిగారు కదా.. ఇదిగో తీసుకో అంటూ బ్లడ్ ప్యాకెట్లతో ప్రగతి భవన్ వైపు దూసుకెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు భారీగా మోహరించి అడ్డుకున్నారు. నిరసనకారులు ముందుకు కదలకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ, డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు ఆందోళనకు (BRSV Protest) దిగారు. రైతుల కోసం మరిన్ని లీటర్ల రక్తాన్ని ఇవ్వడానికైనా తాము సిద్ధమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని, అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read Also: పాలిటిక్స్లోకి ఎన్టీఆర్.. క్లారిటీ ఇచ్చిన టీం
Follow Us On: X(Twitter)

