కలం, వెబ్ డెస్క్ : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని టీజీ చెంచు గిరిజన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల (Mannanur School)లో గురువారం ఉదయం కలకలం రేగింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన అల్పాహారం తీసుకున్న అనంతరం సుమారు 35 మంది విద్యార్థులు అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరి తర్వాత ఒకరికి వాంతులు, విరోచనాలు ప్రారంభం కావడంతో పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను తొలుత మన్ననూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అయితే మన్ననూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస సౌకర్యాల కొరత వేధించింది. ఫుడ్ పాయిజన్ బారిన పడిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలో బెడ్లు కరువయ్యాయి. దీంతో వేరే దారి లేక వైద్య సిబ్బంది విద్యార్థులకు ఆసుపత్రి నేలపైనే పడుకోబెట్టి అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చింది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న గిరిజన విద్యార్థులు నేలపైనే సెలైన్లు ఎక్కించుకుంటూ దయనీయ స్థితిలో కనిపించడం స్థానికంగా తీవ్ర ఆవేదనను, ఆగ్రహాన్ని రేకెత్తించింది.
విద్యార్థుల పరిస్థితిని, ఆసుపత్రిలో ఉన్న వసతుల కొరతను దృష్టిలో ఉంచుకుని, వారికి మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు తక్షణమే బాధితులను అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులను అచ్చంపేటకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో (Mannanur School) ఆహార నాణ్యత లోపించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: డిజిటల్ వారసులు
Read Also : తుంగతుర్తి కాంగ్రెస్ ఫైట్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు!

