కలం, వెబ్ డెస్క్: చరిత్రలో తొలిసారి లార్డ్స్ వేదికగా మహిళల టెస్టు (Women Test) మ్యాచ్ జరగనుంది. శుక్రవారం నుంచి భారత్-ఇంగ్లండ్ (India England) జట్ల మధ్య ప్రారంభమయ్యే ఈ ఏకైక టెస్టుపై భారత మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ ఆనందం వ్యక్తం చేశారు. పురుషుల టెస్టుకు 142 ఏళ్ల చరిత్ర ఉన్న లార్డ్స్లో ఇప్పటివరకు ఒక్క మహిళల టెస్టు కూడా జరగకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ముజుందార్ తెలిపారు. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే డ్రెస్సింగ్ రూమ్లో లార్డ్స్ టెస్టు గురించే చర్చ జరిగేదని చెప్పారు. టీ20 ప్రపంచకప్లో నిరాశ ఎదురైనా, గతాన్ని మార్చలేమని, ఇప్పుడు పూర్తిగా టెస్టు మ్యాచ్పైనే దృష్టి పెట్టామని వెల్లడించారు.
మార్చిలో చివరిసారి టెస్టు ఆడిన భారత జట్టు, ఈ మ్యాచ్ కోసం వోర్మ్స్లీ క్రికెట్ గ్రౌండ్లో రెడ్ బాల్తో ప్రత్యేకంగా సాధన చేసింది. ప్రతి భారత క్రికెటర్కు టెస్టు ఆడటం కల అని, లార్డ్స్లో ఆ అవకాశం రావడం మరింత ప్రత్యేకమని ముజుందార్ అన్నారు. 1996లో లార్డ్స్లో సౌరవ్ గంగూలీ తొలి సెంచరీ, రాహుల్ ద్రవిడ్ అరంగేట్రం ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లార్డ్స్లోని ప్రత్యేకమైన స్లోప్ ఆటగాళ్లకు పెద్ద సమస్య కాదని, మహిళల క్రికెట్లో మరిన్ని టెస్టు మ్యాచ్లు నిర్వహిస్తే ఆట మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

