కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన ఉన్నది. ఈ నేపథ్యంలో వైరా ఏసీపీ సారంగపాణి ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ మార్గాలను బుధవారం వెల్లడించారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చే ప్రజల సౌకర్యార్థం, ట్రాఫిక్ రద్దీ నివారణకు మండలాల వారీగా ప్రత్యేక వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
సభ జరిగే రోజున ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 12:00 గంటల వరకు ఖమ్మం – బోనకల్ మార్గాలలో సాధారణ వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. సభకు వచ్చే రైతులు, ప్రజలు, అధికారులు, మీడియా వాహనాలకు మాత్రమే ఈ మార్గంలో అనుమతి ఉంటుందని, ధాంసలాపురం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు దగ్గర నుంచి బోనకల్ బ్రిడ్జి వరకు సాధారణ వాహనాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సాధారణ ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యామ్నాయ రూట్లను ఖరారు చేశారు. ఖమ్మం నుంచి వయా పందిళ్లపల్లి, చింతకాని, బోనకల్ మీదుగా ఆంధ్రకు వెళ్లే వాహనాలు నేలకొండపల్లి మీదుగా వెళ్లాలని, అదేవిధంగా బోనకల్లు నుంచి ఖమ్మం వైపు వచ్చే వాహనాలు వైరా మీదుగా ప్రయాణించాలని సూచించారు. ఇక హైదరాబాదు నుంచి మీటింగ్ కి వచ్చే విఐపి వాహనాలు కోదాడ, నేలకొండపల్లి, ముదిగొండ లోని వల్లపురం మీదుగా వస్తే సభా స్థలానికి త్వరగా చేరుకోవచ్చని తెలిపారు.
సభకు వచ్చే వివిధ మండలాల వాహనాల కోసం మూడు ప్రత్యేక రూట్లను, పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ఖమ్మం టౌన్, రూరల్, కామేపల్లి, నేలకొండపల్లి, ముదిగొండ, సింగరేణి, తిరుమలాయపాలెం మండలాల నుండి వచ్చే వాహనాలు రూట్ నెంబర్ 1 ద్వారా ప్రయాణించి పార్కింగ్ నెంబర్ 1 నుండి 5 వరకు కేటాయించిన స్థలాలలో నిలపాల్సి ఉంటుంది. చింతకాని, వైరా, ఏన్కూరు, దమ్మపేట, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, చండ్రుగొండ మండలాల ప్రజలు రూట్ నెంబర్ 2 ద్వారా వచ్చి పార్కింగ్ నెంబర్ 7, 8, 15 లలో వాహనాలు పార్క్ చేయాలి. మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చండ్రుగొండ మండలాల వాహనాలు రూట్ నెంబర్ 3 ద్వారా ప్రయాణించి పార్కింగ్ నెంబర్ 10 నుండి 14 వరకు ఉన్న స్థలాలను ఉపయోగించుకోవాలి.
వీవీఐపీలు, ప్రభుత్వ అధికారుల వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ నెంబర్ 6, 9లను కేటాయించారు. ప్రజలు, వాహనదారులు తమకు కేటాయించిన మార్గాల్లోనే ప్రయాణించి, ప్రధాన రహదారులపై వాహనాలను నిలపకుండా పోలీసు అధికారులకు, ట్రాఫిక్ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు.

