కలం, వెబ్ డెస్క్: అసోంలోని (Assam) బరాక్ వ్యాలీ ప్రాంతంలో కొన్ని నెలలుగా భారీ సంఖ్యలో నవజాత శిశువులు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జూలై 3 మధ్య కాలంలో కేవలం శ్రీభూమి జిల్లాలోనే 49 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అసోం ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఇదే సమయంలో పొరుగు జిల్లాలైన కాచర్లో 74, హైలకండిలో 25 చొప్పున శిశు మరణాలు నమోదయ్యాయి. దీనితో బరాక్ వ్యాలీ పరిధిలోని ఈ మూడు జిల్లాల్లో మొత్తం మరణాల సంఖ్య 148కి చేరింది. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బరాక్ వ్యాలీ ప్రాంతంలో ప్రసవ సమయాల్లో అత్యవసర చికిత్సలు, మాతాశిశు సంరక్షణ సేవలు ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తోంది.
ఈ ఉదంతంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ తక్షణమే సమగ్ర దర్యాప్తును ప్రారంభించింది. శిశువులు మరణించడానికి (Newborn Deaths) గల ఖచ్చితమైన కారణాలను గుర్తించి, ప్రతి ఒక్క కేసును నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ప్రసవ సమయంలో ఆక్సిజన్ అందకపోవడం, తక్కువ బరువుతో శిశువులు జన్మించడం ప్రధాన కారణాలుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. అయితే కేవలం వైద్యపరమైన కారణాలే కాకుండా, ఆరోగ్య సదుపాయాలు కూడా ఈ పరిస్థితికి దారితీశాయని అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తామని ఆరోగ్య శాఖ హామీ ఇచ్చింది.

