కలం, వెబ్డెస్క్: షఫాలీ వర్మ (Shafali Varma) ధనాధన్ బ్యాటింగ్తో రాణించడంతో లంకతో పొట్టి సిరీస్లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం అందుకుంది. విశాఖపట్నం వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన పర్యాటక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(31; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), హర్షిత సమరవిక్రమ(33; 32 బంతుల్లో 4 ఫోర్లు) ఓ మోస్తరు పరుగులు చేయగా, మిగిలినవాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అనంతరం 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.5 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి గెలుపందుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Varma) అర్ధ సెంచరీ (69 నాటౌట్: 34 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) చేసింది. జెమీమా రోడ్రిగ్స్(26; 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), స్మృతి మంధాన(14; 11 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), హర్మన్ప్రీత్ కౌర్(10) పరుగులు చేశారు. లంక బౌలర్లలో కవిష, కావ్య, మదార తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 2–0 ఆధిక్యం సాధించింది. తరువాతి మ్యాచ్ తిరువనంతపురం వేదికగా ఈ నెల 26న జరుగుతుంది.


