కలం, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ (Nagarkurnool) నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి (Kuchkulla Rajesh Reddy), ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి (Kuchukulla Damodar Reddy) కృషితో కోట్లాది రూపాయల నిధులు మంజూరవడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి.
దశాబ్దాల క్రితం నిర్మించిన నాగర్కర్నూల్ (Nagarkurnool) బస్స్టాండ్ ప్రస్తుతం జిల్లా కేంద్ర అవసరాలకు సరిపోకపోవడంతో, నూతన బస్స్టాండ్ నిర్మాణానికి రూ.12 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టుకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జిల్లా రవాణా శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించడంతో పాటు తిమ్మాజిపేట బస్స్టేషన్ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా ఆయన నూతన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం నాగర్కర్నూల్–వనపర్తి నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించనున్నారు. సాయంత్రం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్వగ్రామంలో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
Read Also: ఎల్నినో ఎఫెక్ట్.. అన్నదాతల గుండెల్లో ‘కరువు’ దడ!
Follow Us On : WhatsApp

